ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. మన దేశంలో తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపే అత్యున్నత సంస్థ.. నేరస్తులు తప్పించుకోకుండా, దేశం విడిచి పారిపోకుండా కనిపెట్టుకొని ఉండాల్సిన ఈ సంస్థ ఇప్పుడు ఏ ప్రతిపక్ష నాయకుడిని వేధించాలి? అన్న ధ్యాసలో మాత్రమే మనుగడ సాగిస్తున్నది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈడీ రాజకీయ ప్రతీకార అస్త్రంగా మారిపోయిందన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
2014 తర్వాత ఈడీ కార్యకలాపాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తున్నది. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను, వారి మాట వినని పారిశ్రామికవేత్తలను నెలలపాటు జైళ్లలో వేసి వేధించటం పరిపాటిగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసులన్నీ మాయమవుతున్నాయి. గత ఎనిమిదేండ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా 2019లో మోదీ ప్రభుత్వం మనీ లాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ) చట్టానికి సవరణలు తెచ్చిన తర్వాత ఈడీ అరాచకం మరీ పెరిగిందని పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులే వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తామంతా సచ్చీలురం, ఎదుటివారందరూ అవినీతిపరులు, దొంగలేనని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. నరేంద్రమోదీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించేందుకు, వాటి నాయకులను నయానో, భయానో లొంగదీసుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ (ఇన్కంట్యాక్స్) వంటి కేంద్ర సంస్థలను ప్రయోగిస్తున్నారన్న విమర్శలు ఎప్పటినుంచో వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల ద్వారా ఒనగూరని ప్రయోజనం, అధికారం ద్వారా సాధించలేని పనులను ముఖ్యంగా ఈడీని ప్రయోగించి నెరవేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. తమ తప్పుడు నిర్ణయాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని ఇబ్బందుల పాలుచేసేందుకు ఈడీని ఆయుధంగా ప్రయోగించడం ఇంతకుముందు కాంగ్రెస్కు, ఇప్పుడు బీజేపీకి పరిపాటిగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ ప్రత్యర్థులను కొంతకాలం వేధించడం తప్ప ఇంతవరకు ఈడీ నమోదు చేసిన కేసులలో పెద్దగా విజయాలు సాధించినట్టుగా కనిపించదు. ఇంతవరకు ఈడీ నమోదుచేస్తున్న కేసుల్లో కన్విక్షన్ రేటు (ముద్దాయిలకుశిక్ష పడటం) మూడు శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి. దీనిని బట్టి ఈడీ నమోదు చేస్తున్న కేసులలో విశ్వసనీయతపై సామాన్యుల్లో సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపికచేసి మరీ కేసులు
2014 తర్వాత ఈడీ నమోదుచేసిన కేసుల్లో అత్యధికం ప్రతిపక్ష పార్టీల నేతలు, వారికి మద్దతుగా ఉండే పారిశ్రామికవేత్తలపైనే ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ మొదలు టీఆర్ఎస్, శివసేన, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలపై ఈడీ దాడులు చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ కార్యకలాపాలను పరిశీలిస్తే ఆ సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నదో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం లోక్సభకు తెలిపిన వివరాల ప్రకారం 2004-14 మధ్య మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ 112 సోదాలు నిర్వహించగా, 2014 తర్వాత ఎనిమిదేండ్లలో 2,974 సోదాలు నిర్వహించింది. వీటిలో అత్యధికం ప్రతిపక్ష నేతల సన్నిహితులే ఉన్నారు. కొన్ని కేసులు పరిశీలిస్తే..
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఈడీ పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. గత ఏడాది అక్టోబర్లో నార్కోటిక్ కంట్రోల్ బోర్డు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తోపాటు మాలిక్ అల్లుడిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. ఈ కేసు కక్షసాధింపు అని మాలిక్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో గత ఏడాది నవంబర్ 9న మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశం పెట్టి నవాబ్ మాలిక్ ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సోదరికి చెందిన మూడెకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేసిట్టు ఆరోపించారు. ఆ భూమిని మాలిక్ 2003లో కొన్నారు. నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 3న మాలిక్పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మాలిక్ భూమి కొనుగోలు చేసిన రెండేండ్ల తర్వాత 2005లో అమల్లోకి వచ్చిన పీఎంఎల్ఏ చట్టం ప్రకారం కేసు పెట్టడం గమనార్హం.
2020 జూలైలో రాజస్థాన్లో సచిన్పైలట్ నేతృత్వంలో 18 మంది ఎమ్మెల్యేలు అశోక్గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సచిన్పైలట్ లంచాలు ఎరవేశారని గెహ్లాట్ ఆరోపించారు. ఆ సంక్షోభం కొనసాగుతుండగానే ఈడీ హఠాత్తుగా అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అంతకుముందు దశాబ్దం క్రితం అగ్రసేన్ కొన్ని వస్తువుల ఎగుమతి విషయంలో పన్ను ఎగవేశారని గుజరాత్లో ఓ కస్టమ్స్ అధికారి జూలై 19న ఫిర్యాదు చేయటం, 22న ఈడీ దాడులు చేయటం చకచకా జరిగిపోయాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సభలో పాల్గొనేందుకు రోడ్డుమార్గంలో వెళ్తుండగా రైతులు రోడ్లను దిగ్బంధించారు. దీంతో ప్రధాని వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఈడీ నాటి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్సింగ్ను అరెస్టు చేసింది. 2018లో నమోదైన ఇసుక అక్రమ మైనింగ్ కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. విచిత్రమేమిటంటే ఈ కేసులో పోలీసులు దాఖలుచేసిన ఎఫ్ఐఆర్లో భూపిందర్సింగ్ పేరే లేదు.
పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన వేలకోట్ల శారదా పోంజీ కుంభకోణం కేసులో అయితే ఈడీ ఇంకా దుర్మార్గంగా వ్యవహరించింది. అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మకు లంచం ఇచ్చానని ఈ కేసులో ప్రధాన నిందితుడైన శారదా చిట్ఫండ్ కంపెనీ యజమాని సుదీప్త సేన్ స్వయంగా సీబీఐకి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా పలువురు టీఎంసీ నేతలపై చార్జిషీట్ దాఖలుచేసిన ఈడీ, హిమంత బిశ్వశర్మను టచ్ చేయకపోవటం గమనార్హం. ఇదే కేసులో ఒకప్పటి టీఎంసీ నేతలు సువేంధు అధికారి, మిథున్ చక్రవరిని కూడా ప్రశ్నించింది. గత ఏడాది సెప్టెంబర్లో సువేంధు అధికారి, మిథున్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత వారిపై అభియోగాలను ఈడీ పక్కనపెట్టింది.
శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ను కూడా ఈడీ టార్గెట్ చేసింది. దీంతో ఆయన ఈడీ తనను బెదిరిస్తున్నదని ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభ చైర్మన్కు లేఖ కూడా రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వాన్ని కూలదోయాలని, లేదంటే జైలుకు పంపుతామని కొందరు అధికారులు తనను బెదిరించారని ఆరోపించారు. ‘నాతోపాటు ఉద్ధవ్ఠాక్రే క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు సీనియర్ నాయకులను పీఎంఎల్ఏ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఈడీ అధికారులు బెదిరిస్తున్నారు’ అని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రౌత్ భార్యకు చెందిన ఓ ఫ్లాట్ను ఈడీ సీజ్ చేసింది. రౌత్కు సన్నిహితంగా ఉండే ఓ బిల్డర్కు చెందిన భూమిని కూడా అటాచ్ చేసింది. అంతకుముందే మహారాష్ట్రకు చెందిన 15 మంది శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతల ఆస్తులపై ఈడీ దాడులు చేసింది. ఈడీ ప్రశ్నించిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గత ఏడాది అక్టోబర్లో బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా ఆయన ‘ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతా.. నాపై ఎలాంటి విచారణలూ ఉండవు’ అని వ్యాఖ్యానించారు. ఓ బీజేపీ ఎంపీ కూడా ‘నేను బీజేపీలో ఉన్నంతకాలం ఈడీ నా వెంట పడదు’ అని పేర్కొనటం గమనార్హం.
ప్రశ్నించకుంటే దొరలే..
హర్యానాకు చెందిన భూపేందర్ సింగ్ హూడాపై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఆయనపై రూ.75 కోట్ల భూమిని రూ.70 లక్షలకు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. భూపేందర్సింగ్ కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పడంలేదు కాబట్టి ఆయన్ను వదిలిపెట్టినట్టు తెలుస్తున్నది. కర్ణాటకకు చెందిన డీ శివకుమార్పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ ఉన్నది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాలు చేయడం, ఏవో కొన్ని కాగితాలు బయటకు తీయడం ఈడీకి అలవాటుగా మారింది. కేంద్రాన్ని ప్రశ్నించేవారిని వేధించడం, లేకుంటే కేసులను పక్కకు పెట్టడం ఆనవాయితీగా మారింది. మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై కూడా మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. అయినా చిదంబరం రాజ్యసభకు వెళ్లగా, ఆయన కుమారుడు మాత్రం ఈడీని అడ్డం పెట్టుకొని కేంద్రం ఏం చేయగలదో చూస్తానని బహిరంగంగానే చెబుతున్నారు.
రాజస్థాన్లోని బికనీర్లో ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూమి తీసుకొని ఎక్కువకు అమ్ముకున్నారని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఆరోపణలున్నాయి. దీనిపై ఈడీ ఆయనను 11సార్లు ప్రశ్నించింది. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అశోక్ చౌహాన్, మరో కాంగ్రెస్ నాయకుడు దిగంబర్ కామత్పై, కమల్నాథ్ బంధువు రతుల్పురిపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. సురేశ్ కల్మాడీపై కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్టు కేసులు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా వీరిపై ఎటువంటి చర్యలు లేవు. మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారి నవీన్ జిందాల్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు.
సీబీఐని రానివ్వకుంటే ఈడీ
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో అక్కడి ప్రభుత్వాధినేతలను లొంగదీసుకొనేందుకు మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలు ఎన్నోసార్లు వ్యక్తమయ్యాయి. దీంతో పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ, మిజోరం తదితర ఎనిమిది రాష్ర్టాలు సీబీఐ కార్యకలాపాలను నిషేధించాయి. అయితే ఈ నిషేధం ఎన్ఐఏ, ఈడీకి వర్తించదు. ఉగ్రవాద కార్యకలాపాలను దర్యాప్తు చేసే ఎన్ఐఏకు, నల్లధనం, హవాలా వంటి ఆర్థిక అవకతవకలను దర్యాపు చేసే ఈడీకి రాష్ర్టాల అనుమతి అవసరం లేదు. ఈడీ నమోదుచేసే కేసుల్లో నిందితులకు కోర్టులను ఆశ్రయించే అవకాశం కూడా లేదు. ఇంతవరకు ఈడీ చేస్తున్నది తప్పని పేర్కొంటూ కోర్టు ఎవ్వరికీ బెయిల్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టుకో, కిందికోర్టుకో వెళ్లమంటుంది. అక్కడ ప్రభుత్వ న్యాయవాది వాదన విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈడీ తలుచుకుంటేనే బెయిల్ లభిస్తుంది. 2015 తరువాత తెరిచిన నేషనల్ హెరాల్డ్ కేసును ఇంతకాలం నానబెట్టి తాజాగా ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టారు. రాహుల్గాంధీని 40 గంటలకు పైగా ప్రశ్నించినప్పటికీ ఇంతవరకు పెద్దగా ఏమీ కనుగొన్నట్టు ఈడీ అధికారులు వెల్లడించలేదు. ఈ కేసు చివరివరకూ వెళ్తుందా అన్నది సందేహమేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
జాబితాలో 22 మంది బీజేపీ నేతలు
ఈడీ కేసులతో రాజకీయంగా అలసిపోయేలా చేయడం, అలాగే వారి పార్టీ అవినీతికి మారుపేరనే సందేశాన్ని ప్రజల్లోకి పంపడం కేంద్రం వ్యూ హంగా కనిపిస్తున్నది. కేసులు ఎటూ తేలకుండా ఉండడమే ఇందుకు ఉదాహరణ అని పరిశీలకులు పేర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీకి చెందిన 22 మంది నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పటినుంచే వారిపై ఆరోపణలున్నాయి. ఇంతవరకు వారిని ఈడీ ఒక్కసారి కూడా విచారణకు పిలవకపోవడం గమనార్హం.
మూడు చట్టాల ఆధారంగా ఈడీ విధులు
ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హవాలా, విదేశీ మారకద్రవ్యం కేసులను చేపడుతుంది. హవాలా నిరోధక చట్టం, 2002 (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్యం నిర్వహణ చట్టం, 1999 (ఫెమా), ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 (ఎఫ్ఈఓఏ) పరిధిలో ఈడీ కార్యకలాపాలుంటాయి. పోలీలు లేదా ఏదైనా ఇతర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులలో నిందితులు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆధారాలుంటే ఈడీ ఆ కేసును దర్యాప్తునకు తీసుకొంటుంది. ఈడీ నేరుగా కేసు నమోదు చేయదు. కోర్టు అనుమతితో ఈడీ అధికారులు నిందితుడి ఆస్తులు, వాహనాలు, లేదా ఏదైనా సేఫ్ లాకర్లను సైతం పగులగొట్టి తనిఖీ చేయవచ్చు. మనీలాండరింగ్ జరిగినట్టు తగిన ఆధారాలుంటే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. దర్యాప్తు పూర్తయిన తరువాత ఒక నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికపై సీబీఐ కోర్టు లేదా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఫెమా చట్టాలు ఉల్లంఘించినట్టు తేలితే కోర్టు నిందితులకు జరిమానా విధిస్తుంది. నిందితులు ఎంత మొత్తంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారో అంతకు మూడింతలు జరిమానాలు ఉంటాయి. లేదంటే ఏండేండ్ల వరకు కఠిన కారాగార శిక్షలు ఉంటాయి.
నిర్దోషిని అని నిరూపించుకునే బాధ్యత నిందితుడిదే
పీఎంఎల్ఏ చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు లేదా మనీలాండరింగ్ అభియోగాలు మోపబడిన వ్యక్తి తప్పనిసరిగా తాను నిర్దోషి అని కోర్టులో రుజువు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో కోర్టు నిందితుడిని దోషిగా భావిస్తుంది.
ఈడీ దాడులు చేసిన రాజకీయ నేతలు, వారి సన్నిహితులు కాంగ్రెస్: సోనియాగాంధీ, రాహుల్గాంధీ, పీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ చన్నీ సోదరుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
సోదరుడు, భూపీందర్ హుడా, ఓక్రం ఇబోబీ సింగ్, డీకే శివకుమార్.
శివసేన: సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బావమరిది, అనిల్ పరబ్, ఆనంద్రావ్ అద్సుల్.
టీఎంసీ: అభిషేక్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫర్హాద్ హకీం, కునాల్ ఘోష్, సౌగత రాయ్, పార్థ చటర్జీ
ఆమ్ ఆద్మీ పార్టీ:సత్యేంద్ర జైన్.
నేషనల్ కాన్ఫరెన్స్:ఫరూఖ్ అబ్దుల్లా.
ఎన్సీపీ: శరద్పవార్, అజిత్పవార్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, ఛగన్ భుజ్బల్, ఏక్నాథ్ ఖడ్సే.
ఆర్జేడీ: లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, మీసా భారతి.
సీపీఎం: కొడియారి బాలకృష్ణన్ కుమారుడు.
టీఆర్ఎస్: నామా నాగేశ్వర్రావు.
‘మనీ లాండరింగ్ చట్టం అసలైన నేరస్తులను శిక్షించేందుకు తెచ్చిన ఓ విప్లవాత్మకమైన చట్టం. ఇప్పుడది రాజకీయ కక్ష సాధింపులకు అస్త్రంగా మారింది. మీరు నిజంగానే ఆర్థిక నేరాలపట్ల కఠినంగా ఉండాలనుకొంటే తప్పుల చేసినవారందరినీ శిక్షించండి’
-ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి.
‘అధికారం పరంగా దేశం బీజేపీ పాలిత ప్రాంతం, ప్రతిపక్ష పాలిత ప్రాంతంగా విడిపోయింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ఏ ఒక్క బీజేపీ నేత కూడా ఎలాంటి మనీ లాండరింగ్ నేరాలు చెయ్యరు. బీజేపీయేతర రాష్ర్టాల్లోని కీలక నేతలంతా ఇలాంటి నేరాలు చేస్తుంటారు. ఇప్పుడు పరిస్థితి ఇదే’
-కపిల్ సిబాల్, రాజ్యసభ ఎంపీ,సీనియర్ న్యాయవాది.
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పీఎంఎల్ఏ
ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం పెరిగిపోవటంతో ఐక్యరాజ్యసమితి 1999లో మాదక ద్రవ్యాల నిరోధ చట్టాన్ని ఆమోదించింది.
ఆ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత ప్రభుత్వం 2002లో ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) బిల్లును తెచ్చింది. అది 2005లో చట్టంగా మారింది.
ఈడీ విచారణే అతిపెద్ద శిక్ష.
-ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం వ్యాఖ్య