హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది.
వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు వరంగల్లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని జక్రాన్పల్లి మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్నగర్లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి.
పెద్ద విమానాలు నడిపే ఫీజిబిలిటీ లేనిచోట్ల లోకల్గా చిన్న ఫ్లైట్లు నడుపుకునేందుకు అనుమతివ్వాలని తెలంగాణా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టుల ప్రాధికార సంస్థకు ఒక లేఖ రాసింది. చిన్న విమానాలను నడపే అంశంపై చర్చించడానికి భాగస్వాములతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని కూడా కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. అవసరమైతే మరోసారి క్షేత్ర పరిశీలన చేయాలని లేఖలో పేర్కొంది.