హైదరాబాద్ : రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరుగా వ్యాక్సిన్కు వెళ్లవచ్చన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదన్నారు . ప్రస్తుతం 5,783 ఆక్సిజన్ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదన్నారు.
రెమ్డెసివిర్ వంటి ఔషధాలు వైద్యుల సలహా మేరకే వాడాలన్నారు. రెమ్డెసివిర్కు ప్రత్యామ్నాయ ఔషధాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలు సహకరిస్తేనే లాక్డౌన్తో సత్ఫలితాలు వస్తాయన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని కోరారు. మే 31 లోపు ఇంకా 15 లక్షల మందికి రెండో డోసు టీకా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 12 వందలకు పైగా ఆస్పత్రుల్లో కొవిడ్ సేవలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత వారం రోజుల్లో సర్వే ద్వారా 2.6 లక్షల మెడికల్ కిట్లు అందించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పాజిటివిటి రేటు తక్కువగానే ఉందన్నారు.