హైదరాబాద్ : తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాయి. ఏ స్థానంలోనూ అధికార పార్టీ అభ్యర్థులకు విపక్షాలు కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ముందు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చతికిలపడ్డాయి. కారు దూకుడుకు ఆ రెండు పార్టీలు కనుమరుగయ్యాయి.
తెలంగాణ శాసనమండలిలో ఆ పార్టీల అభ్యర్థులకు స్థానం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఒక్కరే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. మండలిలో బీజేపీ బలం గుండు సున్నా. అసలు ఆ పార్టీలకు బలం లేనప్పటికీ.. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతూ.. అడ్డగోలు వాదనలు చేస్తూ ప్రజల చేతిలో అభాసుపాలవుతున్నారే తప్ప.. గెలుపొందడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రవీందర్ సింగ్కు కేవలం 232 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. గత ఏడేండ్లలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 శాతం విజయం సాధించింది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. మిత్రపక్షాలతో కలిపితే టీఆర్ఎస్ బలం 39కి చేరింది. ఇక శాసనసభ కూడా 95 శాతం టీఆర్ఎస్ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ తగ్గలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ఎస్ సభ్యులు -36
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు -6
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు -13
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు -13
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీలు -2
గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీలు -2
ఎంఐఎం సభ్యులు -2
కాంగ్రెస్ -1
ఇండిపెండెంట్ -1