Harish Rao | తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని.. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కారకర్తల సమావేశంలో హరీశ్ పాల్గొని ప్రసంగించారు.
కర్ణాటక కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారని.. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయని అంటున్నారని హరీశ్ రావు తెలిపారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్కు ఇక్కడ కూడా అదే గతి పడుతుందని విమర్శించారు. మనం భయపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తు తమదేనని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదామని పిలుపునిచ్చారు. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా తాము ప్రజల పక్షమని స్పష్టం చేశారు.
ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది అని హరీశ్రావు తెలిపారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని విమర్శించారు. రైతుబంధు పడటం లేదని జడ్పీ చైర్మన్గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని సూచించారు.. రైతు బంధు పడటం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం? అని నిలదీశారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని.. సాగునీళ్లు, తాగునీళ్లు ఉండవని అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గురించి పచ్చి అబద్ధాలు చెప్పిందని హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసిందని ఆరోపించారు. బండి సంజయ్, రఘనందన్ రావు, ఈటల రాజేందర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్సే అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చింది. అని అన్నారు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీశారు. కార్యకర్తలందరూ కష్టపడాలని.. ఎంపీ సీటు మనదేనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు.
వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదని.. 2వేల ఫింఛన్ను కూడా సమయానికి ఇవ్వడం లేదని అన్నారు. రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్.. అన్ని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని.. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టండని సూచించారు. దళిత బంధుకు మంజూరైన నిధులను కాంగ్రెస్ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందన్నారు. .