హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రజలు తమతో పాటు పెంపుడు జంతువులను రైల్లో తీసుకెళ్లేందుకు ఇకపై ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్నది. పెంపుడు జంతువులకు టికెట్ కేటాయించే అధికారాన్ని టీటీఈలకు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. ఇప్పటి వరకు ఫస్ట్క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే తమతో పాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నది. కొత్త ప్రతిపాదన ప్రకారం పెంపుడు జంతువులకు కూడా ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. జంతువుల ప్రయాణాల కోసం ప్రత్యేక బోగీలను జత చేయాలని రైల్వే శాఖ యోచిస్తున్నది. రైలు బయలుదేరడానికి 3 గంటల ముందు లగేజీ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు సమాచారమివ్వాలి.