హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): వివిధ వర్గాల నుంచి విరాళాల రూపంలో వస్తున్న హరిత నిధికి సంబంధించిన ప్రతి రూపాయికి పకా లెకలు ఉండాలని, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో పనులు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కేటాయింపులు, ఖర్చుల లెక్కల వివరాలు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. హరితనిధి విరాళాలు, వ్యయంపై బుధవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి దాకా హరిత నిధికి వచ్చిన విరాళాలు, అయిన ఖర్చు వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2021లో మొదలైన హరిత నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.69.21 కోట్లు జమ అయినట్టు చెప్పారు. ఇందులో రూ.43 కోట్ల మేరకు పనులు మంజూరు అయ్యాయని, రూ.29.39 కోట్లు విడుదల కాగా, 18.72 కోట్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటైన నర్సరీలు, జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్కు మంత్రి సూచించారు. పనుల ఆడిట్ నివేదికలను కూడా పరిశీలించాలని తెలిపారు. సమావేశంలో పీసీసీఎఫ్ (హరితహారం) సువర్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మేడారంలో బంగారం సమర్పణకు ఆన్లైన్ సేవలు
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) అమ్మవారి గద్దెల వద్ద సమర్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం దేవాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ ఈ సేవలను ప్రారంభించారు. మీసేవ వెబ్సైట్లో ముందుగా తన మనుమడు కొండా మురళీకృష్ణ పేరున నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి పొందారు. మీసేవ (ఆన్లైన్, ఆఫ్లైన్), టీయాప్ ఫోలియో (ఆన్లైన్), తపాలాశాఖ (ఆఫ్లైన్) ద్వారా భక్తులు తమ బరువును అనుసరించి నిర్ణీత డబ్బు చెల్లించి ఆయా సేవలను బుక్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీసేవ సెంటర్లు, దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు (తెలంగాణలో 6 వేల కేంద్రాలు) ఈ సేవలను అందించనున్నాయి. బంగారం సమర్పణతోపాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా ఆయా కేంద్రాల ద్వారా డబ్బు చెల్లిస్తే పోస్టల్, కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందించే అవకాశం ఉన్నది. దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా ఈ బంగారం సమర్పణ సేవలను అందిస్తున్నది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.