నాంపల్లి కోర్టులు, జూన్ 1 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైన 14 మంది నిందితులు సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశించారు. గురువారం వారంతా కోర్టుకు హాజరయ్యారు. సిట్ అధికారులు కోర్టుకు చార్జీషీట్ సమర్పించిన అనంతరం సమన్లు పొందాక కోర్టు ముందు హాజరుకావాలని, అప్పటివరకు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులిచ్చారు. కేసులో నిందితులైన రేణుకా రాథోడ్, ఢాక్యానాయక్, కేతావత్ రాజేశ్వర్, కేతావత్ నీలేశ్నాయక్, పత్లావత్ గోపాల్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేందర్, షమీమ్, నలగొప్పుల సురేశ్, అల్లిపూర్ ప్రశాంత్రెడ్డి, తిరుపతయ్య, టీ రాజేంద్రకుమార్తో పాటు దంపతులైన సాయిలౌకిక్, సాయిసుస్మిత కోర్టుకు హాజరుకాగా కోర్టు పైఆదేశాలిచ్చింది.
మిగతా రిమాండ్ ఖైదీలకు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఈ నెల 15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులైన అట్ల సుచరితారెడ్డి, కేతావత్ శాంతిని చంచల్గూడ జైలు నుంచి తీసుకొచ్చిన మహిళా అధికారులు గురువారం న్యాయస్థాయం ముందు హాజరుపర్చారు. కేతావత్ శాంతి తరఫున వేసిన బెయిల్ పిటిషన్కు సిట్ పీపీ కృష్ణయ్య కౌంటర్ దాఖలు చేశారు. వాదనల కోసం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇటీవల రిమాండ్ విధించిన అన్నాచెల్లెలు సహా మరో ఐదుగురిని విచారణ కోసం సిట్ అధికారులు జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.