హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. అడవుల పరిరక్షణ కోసం గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా సంతోష్కుమార్ ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే అడవిని దత్తత తీసుకొంటున్నట్టు వెల్లడించారు. ప్రఖ్యాత రియాల్టీ షో బిగ్బాస్లో సంతోష్కుమార్ పాల్గొన్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో నాగార్జునతో కలిసి వేదికపై సందడి చేశారు. బిగ్బాస్ హౌస్లో మొక్క నాటారు.
వారానికో మొక్క నాటండి
వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని నాగార్జున పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం, దేశం కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ ఏడాదిలో మిగిలిన ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ‘ఒక వ్యక్తి (సంతోష్కుమార్) పట్టుదలతో 16 కోట్ల మొక్కలు నాటారు. మనందరం అనుకుంటే ఇంకెన్ని కోట్ల మొక్కలు నాటగలం? నేను వచ్చే మూడు వారాలు మూడు మొక్కలు నాటుతానని ప్రమాణం చేస్తున్నా. నాకు అడవులంటే చాలా ఇష్టం. ఎక్కడ చూపిస్తే అక్కడ అడవిని దత్తత తీసుకుంటా’అని నాగార్జున వెల్లడించారు.
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి
ప్రజలంతా తమవంతుగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ‘బిగ్బాస్ హౌస్లో నేను మొక్క నాటుతున్నా. మీరు కూడా మీ ఇండ్లల్లో, గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో మొక్కలు నాటండి. ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువగా ముందుకు తీసుకెళ్తె సమాజానికి అంత ప్రయోజనం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. మొక్కలు నాటుదాం.. వాతావరణాన్ని రక్షిద్దాం’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా చాలెంజ్ను ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. నాలుగేండ్లుగా అందరి సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. గ్రీన్ చాలెంజ్ను విజయవంతం చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ చాలెంజ్లో మూడేండ్లలోనే మూడు కోట్ల మొక్కలు నాటారా? అని నాగార్జున ప్రశ్నించగా, ఇప్పటివరకు 16 కోట్లకుపైగా మొక్కలు నాటినట్టు సంతోష్ కుమార్ వెల్లడించారు. హీరో ప్రభాస్ కూడా తన తండ్రి పేరుపై 1,643 ఎకరాల్లో ఉన్న కాజీపల్లి అడవిని, హెటిరో డ్రగ్స్ పార్ధసారథిరెడ్డి 2,500 ఎకరాల అడవులను దత్తత తీసుకున్నారని వివరించారు. తాము నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నామని, శక్తి ఉన్నంతవరకు దీనిని ముందుకు తీసుకెళ్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వృక్షవేదం పుస్తకాన్ని నాగార్జునకు బహూకరించారు.