గీసుగొండ, జనవరి 28: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం దస్రుతండా శివారులోని సింగ్యాతండా మూలమలుపు వద్ద శనివారం అర్ధరాత్రి కారుపై లారీలోని ధాన్యం బస్తాలు పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నర్సంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన జినుకుల నాగరాజు (60) భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధుతో కలిసి శుక్రవారం తమ కారులో వేములవాడ తీర్థయాత్రకు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో.. సింగ్యాతండా మూలమలుపు వద్ద నర్సంపేట నుంచి హైదరాబాద్కు వడ్ల బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న కారు కనిపించడంతో సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ ఒక వైపునకు ఒరగడంతో అందులోని వడ్ల బస్తాలు కారుపై పడ్డాయి. కారులో ఉన్న జినుకుల నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్, లలిత, సింధుకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్దగా శబ్ధం రావడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారుపై ఉన్న బస్తాలను తొలగించి వారిని బయటకు తీశారు. గాయాలపాలైన ముగ్గురు వరంగల్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు
ఎస్సై వెంకన్న తెలిపారు.