హైదరాబాద్, ఫిబ్రవరి 24, (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తిగా రాష్ర్టాల పరిధిలోని అంశమని చెప్పారు. ఆస్తుల విలువ, స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను రాష్ర్టాలు ఖరారు చేస్తాయని, వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్స్టడీస్(సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి అధ్యక్షతన గురువారం కేంద్ర బడ్జెట్పై చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా జీఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థికసంఘం సిఫారసులను కేంద్రం పక్కన పెడుతున్నదని, గతంలో ఈ పరిస్థితి లేదని పేర్కొన్నారు. నీతి అయోగ్ వల్ల రాష్ర్టాలకు ఎలాంటి మేలు జరగడం లేదని చెప్పారు. ఆహారం, ఎరువులు, ఉపాధి కల్పన, విద్యా, ఆరోగ్యం తదితర కార్యక్రమాలకు బడ్జెట్లో కోత విధించడం తిరోగమన చర్యగా ప్రొఫెసర్లు జే మహేందర్రెడ్డి, చంద్రశేఖర్, వెంకటనారాయణ, శ్రీనివాసులు, అలివేలు పేర్కొన్నారు.