Nagarkurnool | నాగర్కర్నూల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎలుక కొరకడంతో నెల రోజుల శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. పెద్దకార్పాములకు చెందిన శివతో నాగనూలుకు చెందిన లక్ష్మికి మూడేండ్ల కిందట వివాహం కాగా నెల కిందట బాబు జన్మించాడు.
లక్ష్మి నాగనూలులోని పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం ఉదయం ఇంట్లో శిశువు ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. గాయాన్ని గుర్తించిన లక్ష్మి వెంటనే నాగర్కర్నూల్ జిల్లా దవాఖానకు తీసుకెళ్లింది. గాయం తీవ్రంగా ఉండటం, శిశువు వయస్సు దృష్ట్యా వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని నిలోఫర్లో చేర్పించారు. అప్పటికే గాయం తీవ్రంగా ఉండటంతో శిశువు శరీరం చికిత్సకు సహకరించలేదు. చికిత్స నిర్వహిస్తుండగానే ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.