రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి ఇద్దరు యువకులు కింద పడిపోయారు. అయితే వెనుకనే వస్తున్న లారీ ఓ యువకుని తలపైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.