నల్లగొండ: నల్లగొండలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికులు సజీవదహనమయ్యాడు. సోమవారం తెల్లవారుజామున మర్రిగూడ బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్పల్లి హైవేపై శ్రీ కృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సుమొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయింది. మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
అయితే నిద్రమత్తులో ఉన్న ఓ వ్యక్తి బస్సు దిగకపోవడంతో అతగు సజీవదహనమైనట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.