MLC Kavitha | హైదరాబాద్ : మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో రెండు సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతుందని కవిత మండిపడ్డారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
మార్చి 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. 2019లో కూడా అదే మాట చెప్పారు. కానీ ఆ హామీలను మాత్రం ఇంత వరకు అమలు చేయలేదని కవిత గుర్తు చేశారు. జనాభా గణన చేయకపోవడం ఇంకా దురదృష్టం అని పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో ఓబీసీ జనాభాను ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు కల్పించాలని కవిత సూచించారు.