హిమాయత్నగర్, జనవరి 25: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేరోజు హైదరాబాద్లోని ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయా ణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని కోరారు. ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ అజీముద్దీన్, మహ్మద్ దస్తగీర్, ఎస్కే మాము, అమర్ సుల్తాన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.