హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు నెలన్నర క్రితమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇదేమిటని అధికారులను సంప్రదిస్తే ఆయా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ అకాడమీ సిద్ధం కాలేదని చెప్తున్నారు. అకాడమీలో మరమ్మతు పనులకు అవసరమైన రూ.15 లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెల గడుస్తున్నా ఆ నిధులు మాత్రం విడుదల కాలేదని వాపోతున్నారు. దీంతో పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ హయాంలోనే ప్రక్రియ పూర్తయినా..
వివరాల్లోకెళ్తే.. సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, రవాణా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15,700 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అదే ఏడాది ఆగస్టులో ప్రిలిమ్స్, డిసెంబర్లో ఈవెంట్స్, 2023 ఏప్రిల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అక్టోబర్లో ఫలితాలను వెల్లడించి, ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. అనంతరం కొందరు అభ్యర్థులు పరీక్షలో ఒకే ప్రశ్నలు పలుమార్లు వచ్చాయని, వాటికి మార్కులు కలపాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వమే కౌంటర్లు కూడా దాఖలు చేయడంతో ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం గత నెల 4న ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులందరికీ ఆర్డర్లు ఇచ్చింది. వారిలో ఎక్సైజ్ శాఖకు ఎంపికైన 559 మందిలో 400 మంది ఉద్యోగాల్లో చేరుతామంటూ రిపోర్టు చేశారు. కానీ, వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వారిలో కొందరు ఇతర ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడ రిపోర్టు చేయడం గమనార్హం.