హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వాయవ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఈ నెల 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ నెల 8, 9 తేదీల్లో పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నదని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, శుక్రవారం అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.