కడ్తాల్, జూన్ 29: వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే నూతన దంపతులు రెండు మొక్కలు నాటాలని వినూత్న నిర్ణయం తీసుకొన్న కడ్తాల్ పంచాయతీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీలో జరిగిన వివాహాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే నవ దంపతులు మొక్కలు నాటాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి ప్రతిపాదన మేరకు పాలకవర్గం తీర్మానించింది. ఇటీవల వివాహం చేసుకొన్న మానస-నర్సింహా దంపతులతో మంగళవారం మొక్కలు నాటించి, మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిపై రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త సంతోష్కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కడ్తాల్ను ఆదర్శంగా తీసుకొని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. ఎంపీతోపాటు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తదితరులు కడ్తాల్ సర్పంచ్ను, పాలకవర్గాన్ని ప్రశంసించారు.
మానవ మనుగడలో డాక్టర్ల పాత్ర మరువలేనిదని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లలందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. ఏ స్వార్థం లేకుండా సకల జీవకోటికి ప్రాణవాయువు అందించే మొక్కల్లాగే, డాక్టర్లు కూడా నిస్వార్థంగా సేవ చేస్తుంటారని ఆయన కీర్తించారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అతికొద్ది మందిలో డాక్టర్లు కూడా ఒకరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతీ డాక్టర్ మొక్కను నాటి సమాజానికి గ్రీన్ మెసేజ్ ఇవ్వాలని ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.