యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజైన శనివారం ఉదయం 9 గంటలకు పెండ్లికుమారుడిగా ముస్తాబైన స్వామివారు శ్రీకృష్ణాలంకారం (మురళీ కృష్ణుడు)లో దర్శనమిచ్చారు. మెడలో స్వర్ణ, వజ్ర, ముత్యాల ఆభరణాలు.. చేతిలో సుమధుర గానామృతాన్ని ఆలపించే పిల్లనగ్రోవి.. ఒంటిపై పట్టుపీతాంబర వస్ర్తాలు.. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించిన దివ్యమంగళ రూపంలో సకల జనావళిని సమ్మోహనం చేస్తూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యమనోహరంగా కనిపించారు. స్వామివారిని చూసిన భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోయారు.
సర్వాంగ సుందరంగా శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణాలంకారంలో లక్ష్మీనారసింహస్వామివారిని తీర్చిదిద్ది ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారి సేవ ఊరేగింది. రాత్రి ప్రధానాలయంలో నిత్యకైంకర్యాల అనంతరం స్వామివారికి పొన్నవాహన సేవ నిర్వహించారు. ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక మండపంలో చెన్నైకి చెందిన శ్రీదేవి నృత్యాలయం ఆధ్వర్యంలో భరతనాట్యం, మంజుల రామస్వామి కళాకారుల బృందంచే భరతనాట్య ప్రదర్శన, డాక్టర్ శివప్రసాద్, మాండలిన్ విద్వాంసులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కచేరి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశికధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, డీఈవో దోర్బల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.