నిజాంసాగర్, మార్చి 8: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 13న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో పర్యటించనున్నట్టు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అతిథిగృహంతోపాటు హెలిప్యాడ్, నాగమడుగు వద్ద నిర్మించిన పైలాన్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. నిజాంసాగర్లో రూ.కోటి వ్యయంతో నిర్మించిన అతిథి గృహంతోపాటు మంజీర పరీవాహక ప్రాంతంలో రూ.25 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం వొడ్డెపల్లి-కొమలంచ శివారు ప్రాంతంలో మంజీర పరీవాహక ప్రాంతంలో రూ.476 కోట్లతో చేపట్టనున్న నాగమడుగు మత్తడి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. పిట్లంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారని తెలిపారు.