హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పాత రాతియుగం నాటి రాతిగొడ్డలి ములుగు జిల్లాలో బయల్పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల- భూపతిపురం గ్రామాల మధ్య గల వాగులో ఈ రాతిగొడ్డలి దొరికింది. ఔత్సాహిక పరిశోధకుడు ఏలేశ్వరం జనార్దనాచారి దీనిని గుర్తించి భద్రపరిచారు.
15.5 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు, 5.5 సెంటీమీటర్ల మందం గల ఈ గొడ్డలిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్.. ఇది పాతరాతియుగానికి చెందినదిగా పేర్కొన్నారు. ద్విపార్శముఖ, ద్వికుంభాకార చేతిగొడ్డలిగా పురాతన మానవులు రాతి పనిముట్టుగా ఈ గొడ్డలిని వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారుడు రవి కొరిసెట్టర్ (కర్ణాటక) ఈ గొడ్డలి 30 లక్షల ఏండ్ల కిందటిదిగా, పాత రాతియుగం తొలిదశకు చెందినదిగా విశ్లేషించారు.