కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 25: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో ముద్దలుగా, మాడిపోయిన అన్నం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు రోజూ ఇలాంటి అన్నం పెడుతున్నారని.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సోమవారం ‘ముద్దల అన్నం.. మాకొద్దు’ అంటూ అన్నం గంజుతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెలరోజుల నుంచి ఇలాంటి అన్నమే పెడుతున్నారని, ఒక్క రోజూ కూడా మెనూ పాటించడంలేదని, మధ్యాహ్నం భోజనంలో సాంబార్తో సరిపెడుతున్నారని వాపోయారు. ఇది ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఇవే వచ్చాయి.. ఇవే పెడతాం.. తింటే తినండి, లేకుంటే లేదు. అంటూ సిబ్బంది తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, తమ పిల్లలు ప్రతి రోజూ ఫోన్ చేసి ఆహారం సరిగ్గా ఉండడం లేదని, ఏమైనా తినడానికి పంపిచాలని కోరుతున్నారని తెలిపారు. తమ పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయలేదని, తాము వండుతామని సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులు కలుగజేసుకుని విద్యార్థులకు సరైన ఆహారం అందిస్తామని తెలుపడంతో శాంతించారు.
మధ్యాహ్న భోజన కార్మికురాలు కవిత మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం, సామగ్రితోనే వంట చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ఉదయం వంటల ఇన్చార్జి ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యంతోనే వంట చేయాలని వారు సూచించడంతో వంట చేశామని తెలిపారు.