హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : ఆయిల్పామ్ గెల ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో ఇండోనేషియా నుంచి ఎగుమతులను నిషేధించిన క్రమంలో గత నెల వరకు భారీగా పెరిగిన ధర ఇప్పుడు తగ్గుతున్నది. గత నెల టన్ను గెల ధర రూ. 20,250 పలకగా, ఈ నెల రూ.16,800కు పడిపోయింది. అంటే ఒక్క నెలలోనే టన్నుకు రూ. 3,450 తగ్గింది. ఈ ధర టన్నుకు రూ.13 నుంచి 14వేల వరకు తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.
అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, పంట సాగులో నష్టం రాదని భరోసా ఇస్తున్నారు. పెరిగిన ధరలే తగ్గుతున్నాయని, దాంతో నష్టం రాదని తెలిపారు. 2015లో టన్నుకు రూ. 6,811 ఉన్న ఆయిల్పామ్ గెల ధర 2,020 నుంచి భారీగా పెరుగుతూ వచ్చింది. 2020లో తొలిసారిగా రూ. 12,800 మార్క్ను దాటింది. ఆ తర్వాత 2021లో రూ. 19,114 పలికింది. ఈ ఏడాది మే నెలలో టన్నుకు రూ. 22,842 ఆల్ టైం రికార్డు ధర పలకడం గమనార్హం.