హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి కేంద్రం రోజురోజుకు ప్రాధాన్యం తగ్గిస్తున్నదని రాజ్యసభసభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. పొరుగుదేశాల కన్నా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందుకు బడ్జెట్లో కేటాయించిన నిధులే సాక్షమని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేయాలని కేంద్రం చెప్తున్నదని, ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగుకోసం రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును పెంచాలని కేంద్రం మాటవరుసకు అంటే సరిపోదని, అందుకు తగిన కార్యాచరణ ఉండాలని సూచించారు.