హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించిన రైతులు ఆయిల్పాం వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తొలిసారిగా రాష్ట్రంలో ఆయిల్పాం సాగు లక్ష ఎకరాలను దాటింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉద్యానశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న ఆయిల్పాం సాగు తెలంగాణ ఏర్పడిన తరువాత గత ఎనిమిదేండ్లలో మూడురెట్లు పెరిగింది. వచ్చే మూడు నెలల్లో మరో 60 నుంచి 65 వేల ఎకరాల వరకు రైతులు ఆయిల్పాం ను సాగు చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాగు నీటి వసతి పెరుగడంతో ఆయిల్పాం సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాంను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇందుకు పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నది. ఓ వైపు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు మార్కెట్లో ఆయిల్పాంకు మంచి ధర వస్తుండటంతో సాగుకు రైతులు కూడా ముందుకొస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంట నూనెలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో దశలవారీగా 20 లక్షల ఎకరాల వరకు ఆయిల్పాం సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా రాష్ట్రంలో కొత్తగా 2019-20లో 5 వేల ఎకరాలు, 2020-21లో 6,500 ఎకరాలు 2021-22లో ఏకంగా 15 వేల ఎకరాలు సాగు చేశారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 44 వేల ఎకరాల్లో సాగు పూర్తిచేశారు. ఈ రెండేండ్లలోనే 60 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగును పెంచారు. ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లలో 33 వేల ఎకరాల్లో సాగు చేయగా.. స్వరాష్ట్రంలో కేవలం ఎనిమిదేండ్ల్లలోనే కొత్తగా మరో 82 వేల ఎకరాలు సాగు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్పాం సాగు విస్తీర్ణం 1.16 లక్షలకు చేరింది.
అగ్రస్థానం దిశగా అడుగులు
దేశంలో ఆయిల్పాం సాగులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం వైపు దూసుకెళ్తున్నది. ప్రస్తుతం 1.16 లక్షల ఎకరాలతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. సుమారు 4 లక్షల ఎకరాలతో ఏపీ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఆయిల్పాం కనీసంగా ఐదు లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఆయిల్పాం విస్తీర్ణం సుమా రు 7 లక్షల ఎకరాలకు చేరుతుంది. దేశంలో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, అస్పాం, మిజోరం, ఒడిశా రాష్ర్టాల్లో అత్యధికంగా ఆయిల్పాం సాగవుతున్నది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల వాటానే అధికం. మిగిలిన రాష్ర్టాల్లో దీని సాగు 30 వేల ఎకరాల లోపే ఉండడం గమనార్హం.