హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2023-24 సంవత్సరంలో 2.15 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ఉద్యానశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే తాజా బడ్జెట్లో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ మేరకు మరింత మంది రైతులను ప్రోత్సహించాలని ఆ శాఖ లక్ష్యం పెట్టుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మరే రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్పామ్ రైతులకు రాయితీలు అందిస్తున్నది. దీనిలో భాగంగా రైతులందరికీ సబ్సిడీలో డ్రిప్ పరికరాలను అందిస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే 2022-23 సంవత్సరంలో 72 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పూర్తయింది. దేశంలో ఒక ఏడాదిలో ఇంత భారీ మొత్తం ఆయిల్పామ్ సాగుచేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకెక్కింది. ఇప్పటివరకు మొత్తంగా సుమారు 1.5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులోకి వచ్చింది.
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఆయిల్పామ్ సాగుపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కొత్తగా ఆయిల్పామ్ సాగుకోసం సుమారు 15 వేల మంది రైతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సాగు విస్తరించింది. అత్యధికంగా సాగుచేసిన జిల్లాల్లో నిరుడు సుమారు 10 వేల ఎకరాలతో కొత్తగూడెం తొలిస్థానంలో ఉండగా, 5,500 ఎకరాలతో ఖమ్మం రెండో స్థానంలో ఉంది. గతంలో ఆయిల్పామ్ పరిచయం లేని జిల్లాల్లో సిద్దిపేట సుమారు 4 వేల ఎకరాలతో తొలి స్థానంలో ఉండటం గమనార్హం.