హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో వరి, ఇతర సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నూనె వినియోగానికి తగినట్టు పంట లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా ఆదాయం కోల్పోవడంతోపాటు అధిక ధరలకు నూనెలను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు అవుతుండగా, వచ్చే నాలుగేండ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. మొక్కలు నాటిన 4 ఏండ్ల తర్వాత పంట చేతికొస్తుంది.
ఏటా రూ.10 వేల కోట్లు
ఆయిల్పామ్ సాగు వల్ల రైతులకు భారీ ఆదాయం సమకూరనున్నది. ఏటా రూ.10 వేల కోట్లకుపైగా నికర ఆదాయం లభించే అవకాశం ఉన్నదని అధికారుల అంచనా. దీనికి అదనంగా రాష్ట్రంలో రూ.12 వేల కోట్లకు పైగా పామాయిల్ వ్యాపారం జరగనున్నది. ఈ లెక్కన ఏటా రూ.22 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగే వీలున్నది.
రాష్ట్ర ఆదాయంలో కీలకం
ఆయిల్పామ్ సాగు ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగనున్నది. ఎకరం ఆయిల్పామ్ సాగు చేస్తే సగటున 10 టన్నుల గెలలు ఉత్పత్తవుతాయి. ప్రస్తుత ధరల ప్రకారం ఎకరానికి రూ.లక్ష వరకు మిగిలే అవకాశం ఉన్నది. నాలుగేండ్లలో 10 లక్షల ఎకరాలకు రూ.10వేల కోట్ల ఆదాయం సమకూరనున్నది. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుతో సుమారు 15-18 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి కానుంది. దీని ధర ప్రస్తుతం టన్నుకు రూ.70 వేలు. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు రూ.11-12వేల కోట్ల పామాయిల్ వ్యాపారం జరగనుండగా, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఆర్జించనున్నది.
6 వేల కోట్ల పెట్టుబడి
రాష్ట్రంలో పామాయిల్ సాగు పెరిగితే ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే కనీసం 50 ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఫ్యాక్టరీ స్థాపనకు రూ.100-120 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.50 ఫ్యాక్టరీల ఏర్పాటు వల్ల రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది. ఫ్యాక్టరీలు, రవాణా, ఆయిల్పామ్ తోటల్లో కూలీలకు చేతినిండా పని లభిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2.5-3 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.