కరీంనగర్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయని, ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తెలిపారు. డ్రైనేజీ సిస్టం మెరుగుపడటంతో పాటు మున్సిపల్ అధికారుల ముందుచూపుతో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డప్పటికి రోడ్ల మీద నీళ్లు నిల్వ లేదన్నారు.
వంగిపోయిన, తుప్పుపట్టిన కరెంట్ పోల్ ను వెంటనే మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. జిల్లాలో చెక్ డ్యామ్ లన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. భారీ వర్షాల తరువాత వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే స్పందించడం కోసం జిల్లా కలెక్టరేట్ లో కాల్ సెంటర్ 0878 – 2265 ఏర్పాటు చేశామన్నారు.