మెదక్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రైతు ఆత్మహత్యపై వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్కు చెందిన రైతు కుర్మ స్వామి తన పొలంలో పదకొండు బోర్లు వేసినా నీరు రాకపోవడంతో అప్పుల పాలై ఆ పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ‘పదకొండు బోర్లు వేసినా పంట రాకపాయె’ అనే శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు గురువారం గ్రామంలోని కుర్మ స్వామి నివాసానికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
స్వామి తల్లిదండ్రులతోపాటు భార్యతో మాట్లాడారు. స్వామి పేరిట గుంట భూమి కూడా లేదని, భూమి ఉంటే రైతుబీమా వచ్చేదని ఏడీ వసంత సుగుణ కుటుంబసభ్యులకు తెలిపారు. ఉన్న ఎకరం కూడా స్వామి తండ్రి ఎల్లయ్య పేరిటే ఉన్నదని పేర్కొన్నారు. స్వామి తనకున్న ఎకరం పొలంలో 11 బోర్లు వేయడంతో అప్పుల య్యాయని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.