హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రాక్టికల్స్ సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టారు. ఇందుకు 11 మంది అధికారులతో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో భేటీ కానున్నది. కమిటీ పూర్తి సిలబస్ను ఖరారుచేసి తెలుగు అకాడమీకి అందజేయనుండగా, దీనిని హ్యాండ్బుక్గా ముద్రిస్తారు. గతంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు థియరీకి 80 మార్కులు, ప్రాక్టికల్స్కు 20 మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం మీద సిలబస్ విద్యార్థులకు భారంగా మారనుండటంతో థియరీ సిలబస్ను తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్లో పాఠ్యపుస్తకంలోని సిలబస్ను కాస్త కుదించనున్నారు.
ఇంగ్లిష్లో మాట్లాడేలా..
ఇంగ్లిష్భాషలో మాట్లాడనిదే కుదరని రోజులివి. కొంతమంది విద్యార్థులు.. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసినా ఇంగ్లిష్లో భావ వ్యక్తీకరణ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్ ఇంగ్లిష్లో ప్రాక్టికల్స్ అమలుచేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంగ్లిష్ ల్యాబ్వర్క్ను అంతర్భాగం చేశారు. ఇంటర్ పూర్తయ్యే కల్లా విద్యార్థి ఇంగ్ల్లిష్లో మాట్లాడేలా శిక్షణనిస్తారు.