కరీమాబాద్, జనవరి 23: వరంగల్లోని పుల్లాయకుంటలో నిరుడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. 140, 142 సర్వే నంబర్లలో నిరుడు కార్యాలయం కోసం భూమి పూజ సైతం నిర్వహించారు. ఆ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని సామాజిక కార్యకర్త ఫసీ, చెరువుల రక్షణ కమిటీ ప్రతినిధి పెరుమాండ్ల లక్ష్మణ్ ఆరోపించారు.
మంగళవారం రంగశాయిపేటలోని స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు విచారణ చేపట్టి స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సూచించారు. స్థలం ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పార్టీ కార్యాలయం నిర్మించకపోతే ఆ స్థలాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.