Nursing Officers | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ ఆఫీసర్లను (స్టాఫ్నర్స్) పోస్టుల నియామక ప్రక్రియలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలో నియమితులైన అభ్యర్థులకు తప్పుడు పేర్లతో మూవ్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆధ్వర్యంలో జరిగింది. అయితే మూవ్మెంట్ ఆర్డర్లు మాత్రం టీఎస్పీఎస్సీ పేరుతో ఇచ్చారు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత అభ్యర్థులు ప్రశ్నించడంతో అధికారులు తూచ్ అంటూ.. ఇచ్చిన లెటర్లను వెనక్కి తీసుకొని, మళ్లీ ఎంహెచ్ఎస్సార్బీ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది.
జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఇటీవల నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆ అభ్యర్థికి జిల్లాలోని ఓ దవాఖానను కేటాయిస్తూ, అందులో చేరాలంటూ మంగళవారం జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మూవ్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అందులో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షలో ఎంపిక అయినట్టు పేర్కొన్నారు. ఆ అభ్యర్థి దవాఖానకు వెళ్లి ఆర్డర్ చూపించగా, అక్కడి అధికారులు తప్పును గుర్తించారు. జిల్లావ్యాప్తంగా టీవీవీపీ పరిధిలో కేటాయించిన అభ్యర్థులందరికీ ఇలాంటి ఆర్డర్లే ఇచ్చినట్టు తేలింది. అభ్యర్థులు ప్రశ్నించడంతో వెంటనే ఆ ఆర్డర్లన్నింటినీ వెనక్కి తీసుకుని, ఎంహెచ్ఎస్సార్బీ పేరుతో ఉత్తర్వులు మార్చి ఇచ్చారు.
ఈ విషయంపై కొందరు అభ్యర్థులు టీవీవీపీ అధికారులను ప్రశ్నించగా.. ‘రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చింది. ఎంహెచ్ఎస్ఆర్బీ కేవలం ఒక ఏజెన్సీ మాదిరిగా నియామక ప్రక్రియను చేపట్టింది’ అంటూ బుకాయించినట్టు తెలిసింది. వాస్తవానికి 5,204 నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి 2022 డిసెంబర్ 30న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంహెచ్ఎస్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో టీవీవీపీ పరిధిలో 757 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు, పరీక్షలు వంటి కీలక ప్రక్రియ మొత్తం గత ఏడాది పూర్తయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా పోస్టులు కలిపి, ఫలితాలు విడదుల చేసింది. దాదాపు 7 వేల మందికి నియామకపత్రాలను అందించింది.