Nursing Officers | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ‘మేం ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7నప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు నర్సింగ్ అభ్యర్థులు నియామక పత్రాలు పొందుతూ మా కుటుంబ సభ్యులుగా మారిన వారి ముఖాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం’.. ఈ ఏడాది జనవరి 31న నర్సింగ్ ఆఫీసర్లు/స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతవరకు బాగానే ఉన్నా నర్సింగ్ ఆఫీసర్లకు ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. మొదటి జీతం తీసుకున్నామన్న సంతోషం వారికి ఇప్పటికీ దక్కలేదు. రెండు నెలలుగా జీతాల కోసం వారు కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జనవరి 31న ఎల్బీస్టేడియంలో అట్టహాసంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. మొత్తం 9 విభాగాల్లో నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి మొదటి వారం నుంచి తమకు కేటాయించిన పోస్టుల్లో చేరారు. పీహెచ్సీలు మొదలు ఉస్మానియా, గాంధీ వంటి సూపర్స్పెషాలిటీ దవాఖానల వరకు దాదాపు రెండు నెలలుగా సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ వారికి వేతనాలు అందడం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతి నెల దాదాపు రూ.50 వేల జీతం అందుతుందని నాడు ఎల్బీ స్టేడియంలో ఊదరగొట్టారు. వారి కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.35 కోట్ల అదనపు భారం మోస్తుందని చెప్పుకొచ్చారు. అభ్యర్థులతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఉద్యోగులకు కూడా ఆ సంబరమే మిగిలింది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషమే తప్ప జీతం తీసుకున్నామన్న సంతోషం వారికి లేకుండా పోయింది. ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, నర్సింగ్ ఉద్యోగులు మాత్రం వేతనాల కోసం ఉగాది రోజున కూడా వేచి చూడాల్సి వచ్చింది.
సాధారణంగా కొత్తగా నియమితులైన నర్సింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయం పర్యవేక్షించాల్సి ఉంటుంది. నియామక పత్రాలు అందుకున్న తర్వాత అభ్యర్థులు సంబంధిత దవాఖాన సూపరింటెండెంట్, డీఎంహెచ్వోలను కలిసి వాటిని అందజేస్తారు. తర్వాత సంబంధిత దవాఖాన లేదా డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది వారికి సర్వీస్ నిబంధనల ప్రకారం ఎంప్లాయీ ఐడీ, బ్యాంక్ అకౌంట్ తదితర నియామక ప్రక్రియను పూర్తిచేసి వివరాలను డీపీహెచ్ కార్యాలయానికి పంపుతారు. వివరాలు అక్కడి నుంచి నర్సింగ్ విభాగానికి చేరుతాయి. అప్పటి నుంచి వారికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. రెండు నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయి అధికారుల అవినీతి కారణంగానే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల తర్వాత కూడా కొన్ని చోట్ల ఇంకా క్లర్కుల స్థాయిలోనే వీరి ఫైళ్లు ఆగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. డీపీహెచ్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత జీతం అందడానికి రెండుమూడు నెలలు పట్టడం కామన్’ అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, పైగా ‘మీరు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి లెక్కపెట్టి వేతనం ఒకేసారి వస్తుంది. రెండుమూడు నెలలు ఆలస్యం అయితే ఏమవుతుంది?’ అని దబాయిస్తున్నట్టు కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. అసలే రెండు నెలలుగా వేతనం అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే, కొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది ‘ప్రతిఫలం’ అందితేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు అందేలా చూడాలని నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు.