మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ నుండి నర్సింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
శనివారం మహబూబ్నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మితో నర్సింగ్ కళాశాల ప్రారంభంపై సమీక్షించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనంలోని పైభాగంలో కళాశాలను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. నర్సింగ్ కళాశాలకు త్వరలోనే పక్కా భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను గతంలోనే భూమిని కూడా సేకరించి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్లో 60 మందితో ప్రారంభం కానున్న మహబూబ్నగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భవిష్యత్తులో అవసరమైన అన్ని వసతులను కల్పించడంతోపాటు, మరింత మంది చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నర్సింగ్ పీజీ కళాశాల కూడా తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు.
జిల్లాలో గతంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అరకొర వసతులు, డాక్టర్లు, నర్సుల కొరతతో ఇబ్బందుల్లో ఉండేదని.. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను మెరుగుపరిచినట్లు మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు చికిత్స అందించడమే కాకుండా, ఆక్సిజన్ ప్లాంటును, ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేసే యూనిట్ను నెలకొల్పినట్లు చెప్పారు. వైద్య పరంగా మహబూబ్నగర్ జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.