హైదరాబాద్ : ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునః ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా.. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గుముఖం పడడంతో మళ్లీ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.
ఇంతకు ముందు జనవరి 1న నుమాయిష్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులతో నుమాయిష్ను మూసేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సొసైటీకి సూచించగా.. నిర్వాహకులు 2న నిలిపివేశారు. ఆ తర్వాత తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడడంతో మళ్లీ ఎగ్జిబిషన్ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.