HomeTelanganaNsui Leader The High Court Expressed Its Anger Over The Filing Of The Petition By Venkat Narsing Rao
ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వస్తే ఎలా?
కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు వారి పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగరావు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 3న ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చిన వెంటనే కోర్టులో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది.
ఎన్ఎస్యూఐ నేత బల్మూరిపై హైకోర్టు ఆగ్రహం
కేసీఆర్పై పిటిషన్ ఉపసంహరణ
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు వారి పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగరావు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 3న ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చిన వెంటనే కోర్టులో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. వినతిపత్రం సమర్పించాక ఈసీ అధికారులకు కొంత సమయం ఇవ్వాలి కదా? అని నిలదీసింది.
అక్టోబర్ 30న బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలను అవమానించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడారని, దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బల్మూరి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ఫిర్యాదు పరిశీలన కోసం ఎన్నికల అధికారులకు గడువు ఇవ్వకుండా ఈ నెల 30లోగానే చర్యలు చేపట్టాలన్న ఆత్రుత ఎందుకని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారులకు కొంత గడువు ఇచ్చాక స్పందన లేకపోతే కోర్టుకు రావడంలో తప్పు లేదని, అలా కాకుండా అపరిపక్వ దశలోనే పిటిషన్ వేశారని పేర్కొన్నది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరడంతో అందుకు హైకోర్టు అనుమతిచ్చింది.