Mahesh Bigala | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ శ్రేణులు దూసుకుపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో వివిధ నియోజక వర్గాలలో ఎన్నారైలు సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ గడప గడపకు వివిధ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సాధనలో ప్రవాస భారతీయులు ముందున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎన్ఆర్ఐ లు సంఘీభావం తెలుపుతున్నారన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. మూడోసారి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయడానికి 52 దేశాల ప్రతినిధులంతా దిశా నిర్ధేశంతో పని చేస్తున్నామని మహేశ్ బిగాల తెలిపారు.
తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్నారైలు నిజామాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్య పోయారని మహేశ్ బిగాల పేర్కొన్నారు. తొమ్మిది ఏండ్లలో నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠదామాలు, ఐటీ హాబ్, సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మించుకున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పనకు పలు కంపెనీలు నిజామాబాద్ నగరానికి తరలి వచ్చాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల తెలంగాణ ఉద్యమం నుండి బీఆర్ఎస్లోనే ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో హిందువులు, ముస్లింలు సర్వ మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాగే నిజామాబాద్ నగరంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్నారైలు చందు తల్లా, అశోక్, నవీన్, శ్రీనివాస్ జక్కిరెడ్డి, సతీష్, అహ్మద్, బిందు తదితరులు పాల్గొన్నారు