ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
హైదరాబాద్: ఎన్నారైలంతా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెంటే ఉన్నారని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు. అమెరికాలోని కొంతమంది ఎన్నారైలతో ఈటల రాజేందర్ జూమ్ యాప్ ద్వారా సమావేశమైనట్టు వార్తల్లో చూశానని, వారంతా నిన్నటి దాకా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసినవారేనని తెలిపారు. ఈటల 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఏ ఒక్కరోజూ మాట సాయం చేయనివాళ్లను చూసి ఎన్నారైలంతా నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నారైలందరూ ఎప్పుడూ అవినీతిరహిత సమాజాన్నే కోరుకున్నారని, సీఎం కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని అనిల్ తేల్చిచెప్పారు. ఒక బీసీ బిడ్డగా తనకు సీఎం కేసీఆర్ గౌరవమిచ్చి ఎన్నారై టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఏ ఇతర పార్టీలకు చెందిన ఎన్నారై శాఖల్లోనూ సామాజిక న్యాయం లేదని పేర్కొన్నారు.