9వేల సిబ్బందితో రెండో పెద్ద కార్యాలయం
నైపుణ్య మానవ వనరులతో సాధ్యమైంది
ఆసియాపసిఫిక్ కార్యకలాపాలు ఇక్కడే
నోవార్టీస్ సీఈవో వసంత్ నరసింహన్
విస్తరణ అవకాశాలపై దావోస్లో
మంత్రి కే తారకరామారావుతో చర్చ
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టీస్ హైదరాబాద్ కార్యాలయం.. ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని ఆ సంస్థ సీఈవో వసంత్ నరసింహన్ ప్రకటించారు. మంగళవారం దావోస్లో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయిన నరసింహన్.. రాష్ట్రంలో నోవార్టీస్ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే తమ కంపెనీ అనేక దేశాల్లో తయారీ యూనిట్లతోపాటు, ఇతర పరిశోధన కేంద్రాలను కలిగి ఉన్నదని.. హైదరాబాద్లో ప్రారంభించిన స్వల్పకాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని నరసింహన్ పేర్కొన్నారు.
భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి ఫార్మా కంపెనీల కెల్లా తన నోవార్టీస్ క్యాపబిలిటీ సెంటర్ అతి పెద్దదని.. స్విట్జర్లాండ్లోని బాసెల్లో తమ కేంద్ర కార్యాలయం తరువాత దాదాపు 9 వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం తమ రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా, డిజిటల్ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకొన్నట్టు తెలిపారు.
ఆకర్షణీయ గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి కేటీఆర్
నోవార్టీస్ సీఈవో నరసింహన్తో సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ కంపెనీ వృద్ధిపై అభినందనలు తెలిపారు. తన కేంద్ర కార్యాలయానికి అవతల అతి పెద్ద కార్యక్షేత్రంగా హైదరాబాద్ మారడం సంతోషదాయకమని చెప్పారు. హైదరాబాద్లో నోవార్టీస్ విస్తరణ వల్ల తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. నోవార్టీస్ వల్ల ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్ర శ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని, హైదరాబాద్ ఎకో సిస్టం ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపారు.