హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నది. ‘అధికారంలోకి వచ్చి 70 రోజులు పూర్తవ్వకముందే.. ఏకంగా 23 వేల ఉద్యోగాలు ఇచ్చా’మని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న బిల్డప్ చూస్తే.. ‘మందికి పుట్టినా.. మన బిడ్డే’ అన్నట్టున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు.. రేవంత్ సర్కార్ నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నది. ‘బర్రె ఎక్కడ కడితే ఏముంది.. ఈనేది మన దొడ్లోనేగా’ అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది. కాంగ్రెస్ సర్కారు ఇలా చెప్పుకోవడానికి సిగ్గుండాలని తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో లక్షా 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. 40 వేలకుపైగా ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడి చేస్తుండగా.. ప్రభుత్వం మారడం కాంగ్రెస్కు కలిసివచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన పరీక్షల అభ్యర్థులకు నియామక పత్రాలిచ్చి ఆ క్రికెట్ రేవంత్రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 2022 డిసెంబర్లోనే సుమారు ఏడు వేల నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సజావుగా పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులను ఎంపిక చేసి, తుది ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో విడుదలలో జాప్యం జరిగింది. ఈ పోస్టులకు ఎలాంటి కోర్టు కేసులు లేకపోవడంతో రేవంత్ సర్కార్కు కలిసొచ్చింది. గత డిసెంబర్లో ఫలితాలు విడుదల చేసి, జనవరి 31 నియామక పత్రాలు అందించి.. 6,956 పోస్టులను తాను ఇస్తానన్న 2 రెండు లక్షల ఉద్యోగాల ఖాతాలో సీఎం రేవంత్రెడ్డి వేసుకున్నారు. ఆ తర్వాత సింగరేణిలో 441 కారుణ్య నియామకాలకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి నియామక పత్రాలు అందించేందుకు కూడా ఎన్నికల కోడ్ అడ్డు రావడం, ప్రభుత్వం మారడంతో ఇటీవల ఆ ఉద్యోగుల నియామక పత్రాలు సీఎం రేవంత్రెడ్డి అందించారు. వాటిని కూడా తానిస్తానన్న ఉద్యోగాల ఖాతాలో వేసుకున్నారు.
రాష్ట్ర పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. 2022 ఏప్రిల్లో 16,604 కానిస్టేబుల్, 587 ఎస్సై తత్సమాన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిల్లో 587 ఎస్సై ఉద్యోగాలకు విజయవంతంగా ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి గతేడాది ఆగస్టులో నియామకపత్రాలు అందించగా వారు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. 16,604 కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలకు బోర్డు విజయవంతంగా అన్ని పరీక్షలు నిర్వహించి.. అక్టోబర్లోనే తుది ఫలితాలు విడుదల చేసింది. ట్రాన్స్లేషన్ సమస్యపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడంతో.. తుది ఫలితాలు వెలువడే నాటికి ఎన్నికల కోడ్ రావడంతో, ప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోయింది. ఇటీవల సుప్రీంకోర్టులో టీఎస్ఎల్పీఆర్బీ కేసు గెలువడంతో.. ‘కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు’ అన్నట్టు వెంటనే సీఎం రేవంత్ నియామక ప్రతాలు సిద్ధం చేయించారు. వాటిని బుధవారం 13,444 కానిస్టేబుల్ అభ్యర్థులకు అందజేసి.. వాటిని కూడా తాను ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల ఖాతాలో వేశారు.
2023లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఐబీ) ద్వారా 9,210 ఉద్యోగాలకు నియామకాలు చేపట్టింది. గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించింది. వాటికి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన, తుది జాబితాను ఇటీవల టీఆర్ఐబీ విడుదల చేసింది. దీంతో 1,276 పీజీటీ టీచర్లు, 526 లైబ్రేరియన్, 348 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలు అందించి.. వాటిని సైతం తాను ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాల ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా కేసీఆర్ హయాంలో చేపట్టిన 22,991 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి.. రెండ్రోజులు ఎల్బీ స్టేడియంలో పండగ చేసుకుంటున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మిగిలిన 3,160 పోస్టులకు, గురుకుల ఉద్యోగాల్లో మిగిలిన 7,060 పోస్టులకు కూడా సీఎం రేవంత్రెడ్డే మళ్లీ నియామక పత్రాలు అందించి.. మరోసారి తానే ఉద్యోగాలు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు.