కమలాపూర్, ఏప్రిల్ 8: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం మరో 20 మందికి పోలీసులు 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపులో హిందీ ప్రశ్నపత్రం మొదట స్ప్రెడ్ కావడంతో పోలీసులు ఆ గ్రూపులో ఉన్న వారిపై దృష్టి సారించారు. వాట్సాప్ గ్రూపులో 149 మంది ఉండగా అందులో 20 మందికి నోటీసులు అందజేశారు.
వాట్సాప్ గ్రూపులో ఉన్న వ్యక్తుల మొబైల్ నెంబర్లను సేకరించి వారి ఇంటి చిరునామాలకు వెళ్లి నేరుగా పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన 20 మందిలో 10 మంది విద్యార్థులు, మరో 10 మంది హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నోటీసులు అందిన వారం రోజుల్లో డీసీపీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.