హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల కొరతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పరికరాల కొరత, విధానపరమైన లోపాల కారణంగా రోగులు కొత్త వ్యాధుల బారిన పడుతున్నారని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేరొంటూ దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ పరికరాల కొరత ఉందని, సరైన పరీక్షలు, రక్తమార్పిడి చేయకపోవడం వల్ల కొత్త వ్యాధులు వస్తున్నాయని పేరొంటూ ఒక అడ్వకేట్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం గా పరిగణించి విచారణ చేపట్టింది.
‘ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కో డయాలసిస్కు ప్రభుత్వం రూ.1950 చెల్లిస్తున్నది. ఒక పరికరంతో ఒకరికి మాత్రమే డయాలసిస్ చే యాలి. ఒక్కోసారి ముగ్గురికి కూడా వాడుతున్నారు. దీంతో మిగిలిన డయలైజర్లను ఆరోగ్యశ్రీ, ఇతర అధికారులు చేతులు కలిపి బయట అమ్మేస్తున్నారు. రక్తశుద్ధి, డయాలసిస్ యంత్రాలు పనిచేయడంలేదు’ అని న్యాయవాది లేఖలో పేరొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ ఎండీలకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.