Telangana | భైంసా : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 అకౌంట్లో జమ చేస్తామని అమలు చేయడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహారావును ఆ పార్టీ ఆదరించలేదని హిమంత బిస్వా శర్మ అన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం పీవీకి భారతరత్న ప్రకటించి.. ఆయన్ను గౌరవించారని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షల అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రధాని మోదీతోనే సాధ్యమైందని అన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.