హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎండాకాలంలో మారుమూల, సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో తాగునీటి వసతులపై మంత్రి సత్యవతి శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం రాకముందు గ్రామాలకు తాగునీటి కొరత ఉండేది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు ఇచ్చేవాళ్లం. గిరిజన గ్రామాల గోస చెప్పేది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ తెచ్చాక దాని ద్వారా 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నామని మంత్రిత తెలిపారు.
ఆగిపోయిన ఆ ఒక్క శాతం కూడా సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలే. మొత్తం రాష్ట్రంలో మిషన్ భగీరథ ఇబ్బందులున్నవి 105 ఆవాసాలు మాత్రమే. వీటిల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ కరెంటు లేక తాగునీటి సమస్య ఉంది.
సీఎం ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. కరెంటు లేనిచోట సోలార్ ద్వారా విద్యుత్ అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని కలెక్టర్లు, ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో నీటి ఎద్దడి రాకుండా చూడాలి. గతంలో రాష్ట్రంలో సగం ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో 30,40 నివాసాలకు ట్యాంకర్లు ఇవ్వడం కష్టం కాదు.
కావున ఈ ఎండాకాలం మొత్తం తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన చోట వాటర్ ట్యాంకర్లతో నీరు అందించాలనలి ఆదేశించారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి ఎన్ని పరిష్కార మార్గాలు ఉంటే అన్నింటిని అమలు చేయాలన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను తాగునీటి సమస్య తలెత్తకూడదని స్పష్టం చేశారు.