మిర్యాలగూడ, జూన్ 14: కట్టుకున్న భార్యను కాదు.. ఆమె పుట్టింటి నుంచి వచ్చి న ఆస్తిని ప్రేమించాడు ఓ భర్త. ఆమె అనారోగ్యంతో మరణించినా దవాఖాన నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అనాథలా వదిలేశాడు. భార్య తెచ్చిన ఆస్తితో జల్సాలు చేస్తూ.. మరో మహిళతో కాపురం చేస్తున్నా డు. ఈయన వక్రబుద్ధిని చూసి స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన పైళ్ల గోపాల్రెడ్డి గతంలో స్థానికంగా వెల్డర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య శ్రీలత (55), ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీలత తల్లిదండ్రులు నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో ఆమెకు ఇచ్చిన ఐదెకరాల భూమిని అమ్మి ఆ మొత్తాన్ని వ్యాపారం చేసేందుకు భర్తకు ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారంలో పురోగతి సాధించిన గోపాల్రెడ్డి మిర్యాలగూడ పట్టణంలో అత్యంత విలువైన వాణిజ్య సముదాయాన్ని నిర్మించాడు.
అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి అతను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. వేరే మహిళతో కాపురం చేస్తున్నాడు. దీంతో ఆమె పదేండ్లుగా తల్లిగారి ఇంటివద్దే ఉంటూ మానసికంగా కుంగిపోయి అనారోగ్యం బారినపడింది. శ్రీలత ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ విషయమై ఆమె తల్లి, బంధువులు గోపాల్రెడ్డికి సమాచారం ఇచ్చినా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాలేదని, కుమారులను కూడా రానివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తల్లి చనిపోయిన విషయాన్ని కుమారులకు తెలియకుండా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయాడని మహిళా సంఘాల బాధ్యులు మండిపడుతున్నారు. ఈ మేరకు బంధువులు, ప్రజా సంఘాల నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.