హైదరాబాద్: రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. దీంతో వర్షాల తీవ్రత కూడా తగ్గింది. ఈ నెల 13 వరకు పలుచోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో భువనేశ్వర్కు ఉత్తర ఆగ్నేయ దిశలో 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం బలహీనపడి అల్పపీడనంగా మారి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రుతుపవనాల ద్రోణి నలియా, అహ్మదాబాద్, ఇండోర్, రాయగఢ్ మీదుగా కోస్తా ఒడిశా వద్ద ఉన్న వాయుగుండం వరకు వ్యాపించి ఉన్నదని వెల్లడించింది.
ఈ వాయుగుండం ప్రభావం మరాఠ్వాడ, విదర్భ, ఒడిశా, ఛత్తీస్గఢ్పై ఉన్నదని, తెలంగాణపై నామమాత్రంగానే ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.