భైంసా, ఏప్రిల్ 21 : కరోనా సోకిందని తెలియగానే ఆమడదూరంలో ఉంటున్న ప్రస్తుత తరుణంలో కొవిడ్ సోకిన గర్భిణులకు నిర్మల్ జిల్లా భైంసా ఏరియా దవాఖానలో వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తూ తల్లీబిడ్డలను రక్షిస్తున్నారు. దవాఖానలో ఇప్పటివరకు కొవిడ్సోకిన ఏడుగురు గర్భిణులకు నార్మల్ డెలివరీ చేశారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు గర్భిణులు వివిధ సందర్భాల్లో కొవిడ్ బారినపడ్డారు. నెలలునిండగా.. భైంసా ప్రభుత్వ ఏరియా దవాఖానలో ప్రవసం కోసం చేరారు. ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందించారు.
ఈ నెల 2న సిమ రాథోడ్కు, 7న కుభీర్ గ్రామానికి చెందిన సుజాత పురిటి నొప్పులతో దవాఖానకు వచ్చింది. ఆమె బాధ చూసిన డాక్టర్ వనిత, సిబ్బంది ముందుకొచ్చి ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డను రక్షించారు. ఇలా ఇప్పటివరకు ఏడుగురికి నార్మల్ డెలివరీలు చేశారు. వీరికి స్టాఫ్ నర్సులు త్రివేణి, రాజేశ్వరి, శైలజ, సునీత, మంజూష, సువర్ణ అండగా ఉంటున్నారు. వైద్యులు, సిబ్బంది సేవలను అందరూ అభినందిస్తున్నారు.