నల్లగొండ : దివంగత శాసనసభ్యులు నోముల నరసింహ్మయ్య, గుండెబోయిన రామూర్తి యాదవ్ ప్రజల గొంతుకులై నిలిచారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిత్యం ప్రజల కొరకు పరితపించిన నేతలు వారని ఆయన కొనియాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు మండలం వెంపాడ్ గ్రామంలో నోముల, గుండెబోయిన విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..జీవితాన్ని ప్రజాపోరాటలకు అంకితం చేసిన నేత నోముల అని అన్నారు. అటువంటి నాయకుడి చిరకాల స్వప్నం నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకమన్నారు. ఆ స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు.
అటువంటి నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రామూర్తి యాదవ్, నోముల చరిత్ర సృష్టించిన నేతలు అని అని కొనియాడారు. వారి సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, శాసన మండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, శాసనసభ్యులు యన్.భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి,శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.