చేర్యాల, మార్చి 27 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. డిసెంబర్ మాసంలో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 11వారాల పాటు కొనసాగాయి. శనివారం నుంచే భక్తులు స్వామి వారి క్షేత్రానికి చేరుకున్నారు.
ఆదివారం వేకవ జామునే నిద్ర లేచిన భక్తులు పవిత్ర స్నానం అచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం కోసం ఒక్కో భక్తుడు దాదాపు 3గంటల నుంచి 5గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు, చిలుక పట్నం, నజరుపట్నం, మహామండప పట్నాలు వేయించి పూజలు నిర్వహించారు.
మరికొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. అలాగే స్వామి వారి గుట్ట పై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు తీసుకుపోయి మొక్కులు తీర్చుకున్నారు.